పోలియో మహమ్మారిని శాశ్వతంగా తరిమివేసేందుకు ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారులకు చుక్కల మందు వేయించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఆదివారం ఖమ్మం నగరం 40వ డివిజన్ మొనినాన్ ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు ఆయన చుక్కల మందు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్స్ పోలియోలో భాగంగా 0-5 ఏండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా హెల్త్ సెంటర్లు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
పోలియో చుక్కల మందు పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా 1.30లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిందని, వారందరికీ చుక్కల మందు పకడ్బందీగా అందించాలని వైద్య శాఖను ఆదేశించారు. రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) సిబ్బంది ఇంటింటికీ తిరిగి, ఇంకా ఎవరైనా టీకా వేసుకోనివారు ఉంటే గుర్తించి పోలియో వ్యాక్సిన్ వేస్తారని వివరించారు.
మొత్తం మూడు రోజులపాటు జరిగే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. వైద్యారోగ్యశాఖతో పాటు ఐసీడీఎస్, విద్య, పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజాప్రనిధులు, సంభందిత అధికారులు, సిబ్బంది తమ నియోజకవర్గంలోని గ్రామాల్లో పూర్తి స్థాయిలో చుక్కల మందు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్ , డీఎంహెచ్వో మాలతీ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్ దాదే అమృతమ్మ సతీష్ తదితరులు ఉన్నారు.