హైదరాబాద్: క్లిష్ట పరిస్థితులను ఆర్టీసీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కాలేజీని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ప్రారంభం శుభపరిమాణం అని చెప్పారు. దవాఖానను మరింత బలోపేతం చేయాలన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులు వాడితే డీజిల్ ధరల భారం తగ్గించుకోవచ్చని వెల్లడించారు. డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పారు. డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను తగ్గించుకోవాలని అంటున్నదని విమర్శించారు. లాభాల బాటలో ఉన్న సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయబోతున్నామని చెప్పారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. తార్నాక దవాఖానను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ కాపాడుకుంటామని చెప్పారు.