హైదరాబాద్ : నవీన్ కుమార్ చింతపండు అలియాస్ తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ షాకిచ్చారు. పలు సందర్భాల్లో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన తీన్మార్ మల్లన్నకు పువ్వాడ అజయ్ తన న్యాయవాది చేత లీగల్ నోటీసులు పంపించారు. ఈ మేరకు తన పరువుకు భంగం కలిగించినందున మల్లన్నపై అజయ్ కుమార్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. తన క్లయింట్కు ఏడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని తీన్మార్ మల్లన్నను న్యాయవాది డిమాండ్ చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన మల్లన్న తన యూట్యూబ్ చానెల్లో మంత్రి అజయ్పై అసత్య ఆరోపణలు చేశారని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. అసభ్యకర పదజాలంతో మంత్రిని దూషించారని తెలిపారు. అజయ్ కుమార్ భూకబ్జా చేశారని మే 13న మల్లన్నకు సంబంధించిన డిజిటల్ వార్తాపత్రికలో ప్రచురించారు. ఈ వార్తలు నిరాధారమైనవని న్యాయవాది తన నోటీసుల్లో స్పష్టం చేశారు. అజయ్ కుమార్ను ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా మల్లన్న యత్నించారని నోటీసుల్లో పేర్కొన్నారు.