ఖమ్మం: గోదావరి వరదలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, వరద ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక అధికారులు రజత్ కుమార్, సింగరేణి సీఎండీ శ్రీధర్, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంత్ రావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా వైద్య ఆరోగ్య, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సహాయక చర్యలను కొనసాగించాలన్నారు.