ఖమ్మం, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన ప్రకటన తెలంగాణ ప్రజలను మోసపుచ్చేలా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు. విభజన హామీలను తుంగలో తొక్కడం కేంద్రానికి అలవాటుగా మారిందని విమర్శించారు.
ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎనిమిదేండ్ల కిందటే నివేదికలు ఇచ్చిందని గుర్తుచేశారు. వాటన్నింటినీ పక్కనబెట్టి కిషన్రెడ్డి ఏ ఆధారంతో సాధ్యం కాదని ప్రకటిస్తారని మండిపడ్డారు. కిషన్రెడ్డి తీరు చూస్తుంటే ఆయన తెలంగాణ వ్యక్తి కాదేమోననే అనుమానం వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు.
గుజారాతీలకు గులాములు: తాతా మధు
తెలంగాణ బీజేపీ ఎంపీలు గుజరాతీలకు గులాములని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిలిచిపోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు.