హైదరాబాద్: హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay Kumar) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా 760 బస్సులకు ఆర్డర్ పెట్టామని, వాటిలో ఇప్పటికే 400 పైగా బస్సులు డిపోలకు చేరుకున్నాయన్నారు. ప్రయాణికులకు సౌకర్యం కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా లహరి స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. త్వరలో 1,300 ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా (Lahari AC Sleeper bus) నామరణం చేసిన ఈ బస్సులు బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో సేవలు అందించనున్నాయి.
తొలిసారిగా వాడకంలోకి తెస్తోన్న ఏసీ స్లీపర్ బస్సు 12 మీటర్ల పొడవు, 30 బెర్తుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యంతో పాటు ట్రాకింగ్ సిస్టం, పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వాటర్ బాటిల్ సాకెట్, మొబైల్ చార్జింగ్ సౌకర్యం, రీడింగ్ ల్యాంప్లను ఏర్పాటు చేశారు. గమ్యస్థానాల వివరాలు తెలిపేలా ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులుంటాయి. సెక్యూరిటీ కెమెరాలతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పారింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం (ఎఫ్డీఏఎస్) కూడా ఉంటుంది.