ఖమ్మం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రజలకు ఏమిచేశారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపడుతున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రశ్నించారు. కిషన్రెడ్డిది ప్రజలను మాయచేసే, తప్పుదోవ పట్టించే యాత్ర అని పేర్కొన్నారు. శనివారం ఆయన ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో మొండిచేయి చూపిస్తున్నదని విమర్శించారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వడంలేదని ఆరోపించా రు. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వని కేంద్రం, తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్నులతో ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీ పాలితరాష్ర్టాల్లో అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు. ఇక్కడి డబ్బులతో అక్కడ వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేయిస్తున్నదని చెప్పారు. కేంద్రం పీఎంజీఎస్వై పథకం పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్రం మొండిచేయి చూపించినా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని వివరించారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.