ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లను దోచుకునేవాళ్లను దొంగలనే అంటారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఏపీ కట్టే అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుని తీరుతుందని స్పష్టంచేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో ఎంతటి పోరాటానికైనా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెనుబల్లి మండలం అడవిమల్లేలలో జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణకు రావాల్సిన వాటా నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని ఉద్ఘాటించారు. మంత్రి కేటీఆర్ అన్నట్టుగా.. నీళ్ల కోసం దేవుడితోనైనా పోరాటం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతుందని, కేటాయించిన నీళ్లను వినియోగించుకుంటుందే తప్ప ఎవరినుంచి అక్రమంగా పొందడం లేదన్నారు. తమ ప్రభుత్వం పొరుగు రాష్ర్టాలతో ఎంతమాత్రం వివాదం కోరుకోవట్లేదని స్పష్టంచేశారు. రాయలసీమకు నీళ్లిచ్చేందుకు తెలంగాణను ఎడారిగా చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుల వల్ల ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడనున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
రైతు శ్రేయస్సే సీఎం కేసీఆర్ లక్ష్యం
రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. 57ఏళ్లు నిండిన అర్హులందరికీ వచ్చే నెల నుంచి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని చెప్పారు. సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు మాదిరే జూనియర్ కార్యదర్శులకు కొత్త వేతనాలను త్వరలో ఇస్తామని మంత్రి ప్రకటించారు.