ఖమ్మం, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా ముక్కు నేలకు రాసి క్షమాపణ చేప్తానని, ఆస్తులను ప్రజలకు పంచుతానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం ప్రజాఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కరటక, దమనకులని పరోక్షంగా విమర్శించింది కాంగ్రెస్ నేతలైన పొంగులేటి, తుమ్మలేనేనని స్పష్టం చేశారు. చిన్నయసూరి నీతి కథలో కరటక, దమనకులనే రెండు నక్కలకు సంబంధించిందని, ఆ నకల అసలు రూపం వారిద్దరేనని అభివర్ణించారు. వారి నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల మధ్యకు వచ్చే వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు.