ఖమ్మం, అక్టోబర్ 17: ‘తెలంగాణలోని ఏ ఒక్క ఆడ బిడ్డ కూడా కన్నీరు పెట్టకూడదు. ఆమె కంట వెలుగులు నిండాలి. ఆమె సంతోషంగా ఉండాలి. ఈ లక్ష్యంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సహా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు’ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఖమ్మం నియోజకవర్గంలోని 64 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
టీఆర్ఎస్(బీఆర్ఎస్) నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ‘పేదింటి ఆడబిడ్డల పెండ్లి కష్టాలు తీర్చేందుకు, వారి కన్నీళ్లు తుడిచేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అండగా నిలిచారు’ అని చెప్పారు.
తెలంగాణలోని సంక్షేమ పథకాలు తమకు కూడా కావాలంటూ దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 7,515 మందికి రూ.70.21 కోట్ల విలువైన చెక్కులు అందించడం గర్వంగా ఉందని తెలిపారు. లబ్ధిదారులతో కలిసి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సహఫంక్తి భోజనం చేశారు.
అనంతరం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధునాతన పరికరాలను ఆయా వృత్తిదారులకు పంపిణీ చేశారు. ఖమ్మంలోని 56వ డివిజన్ ద్వారకానగర్లో రూ.45 లక్షలు, 51వ డివిజన్ ఎన్ఎస్పీ క్యాంప్లో రూ.45 లక్షలు, 39వ డివిజన్ మేదరబజార్లో రూ.45 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.