మునుగోడు రూరల్, అక్టోబర్ 13: బీజేపీ స్వార్థంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కొరటికల్ గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్మేళన సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు వరకు కురుమలు ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రె పిల్ల ను పట్టుకుని పోయిన పాలకులే తప్ప, వారికి తొలిసారి గొర్రె పిల్లలను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు.
తెలంగాణ సబ్బం డ వర్ణాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతుందని విమర్శించారు. బీజేపీ స్వార్థంతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని ఆరోపించారు. ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం, ఆర్థికవృద్ధి మందగించడం వంటి వాటికి ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇతర బయటి అంశాలే కారణమని మోదీ సర్కార్ చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ పాలనను యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటుంటే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికలో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కురుమ సంఘం నేతలు పాల్గొన్నారు.