Minister Ajaya Kumar | రఘునాథపాలెం : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధి జిల్లాలో తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలోనే జరిగిందన్నారు. రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలులో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. సమ్మేళనాలను చూసి కొన్ని శక్తులు జీర్ణించుకులేకపోతున్నాయని విమర్శించారు. పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఆర్థికంగా ఎదిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, తనపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ను గద్దె దించుతామంటూ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నాడని ధ్వజమెత్తారు. డబ్బుతో, అహంతో ప్రజల ఆత్మాభిమానాలను కొనలేరన్నారు. కాంట్రాక్టర్గా అడ్డదారుల్లో కోట్లకు పడగలెత్తిన పొంగులేటి.. అతని అనుయాయులతో తనపై తప్పుడు ప్రచారాలను చేయించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. దీన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు సహించరన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకుంటున్న బీజేపీకి తెలంగాణలో దిక్కులేని పరిస్థితులే ఉన్నాయని విమర్శించారు.
దక్షిణ భారతదేశంలో ఆ పార్టీకి పుట్టగతులుండవని అన్నారు. కాంగ్రెస్కు 60 స్థానాల్లో అభ్యర్థులే లేరని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ పూర్తిగా విఫలం కావడం, ప్రజలకు మరో అవకాశం లేకపోవడం వల్లనే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను ఆదరించారు తప్ప మరో కారణమేమీ లేదని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తాను తెచ్చుకున్న కరెన్సీ నోట్లను రెండుసార్లు రద్దు చేసి చరిత్ర సృష్టించారని విమర్శించారు.
ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలల సమయం మాత్రమే సమయం ఉన్నందున బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏకబికిన అత్యధిక రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎంగా కేసీఆర్ దేశంలో చరిత్రను సృష్టించపోతున్నారన్నారు. అదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో మూడోసారీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చరిత్రను తిరగరాయబోతున్నట్లు స్పష్టం చేశారు.