హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజును పురస్కరించుకొని.. మినిస్టర్ క్వార్టర్స్లో ఆయన సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు డా. పువ్వాడ నయన్ తో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన హరితహరం గొప్ప ఫలితాలను ఇస్తుందన్నారు.
హరితహారానికి కొనసాగింపుగా ఎంపీ సంతోష్ కేసీఅర్ గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు ప్రకృతిని పరిరక్షించాలని, వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. మొక్కల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.