హైదరాబాద్, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలంతా బీజేపీని ఎక్కడిక్కడ నిలదీయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై ముప్పేట దాడి చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని నిలదీస్తూ ఆయన శుక్రవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్రం పెంచిన ఎరువుల ధరల తగ్గింపు విషయంలో రాష్ట్ర బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కేవలం ఏడున్నరేండ్లలోనే వ్యవసాయ రంగంలో అసాధారణ ప్రగతి సాధించామని, ఇది దేశమంతా జరగాలని రైతాంగం ఆకాంక్షిస్తున్నదని తెలిపారు. దేశమంతా సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగాన్ని దేశానికే దిక్సూచిగా మలచాలన్నది సీఎం కేసీఆర్ ఆశయమైతే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు.
కార్పొరేట్ల కోసమే
బీజేపీకి మిత్రులైన కొందరు కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ వ్యవసాయాన్ని, అన్నదాత బతుకును కేంద్రం తాకట్టు పెడుతున్నదని ప్రశాంత్రెడ్డి విమర్శించారు. రైతులను కూలీలుగా మార్చే కుట్రలకు తెరలేపిందని నిందించారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరపై చట్టం తేవాలని కోరితే పట్టించుకోకపోవటంలో కేంద్రం ఆంతర్యం వ్యవసాయ రంగాన్ని మరింత కుదేలు చేయటమేనని ఆరోపించారు. కేంద్రం 3 నెలల్లోనే ఎరువుల ధరలు 50% నుంచి 100% పెంచి రైతులకు పండుగ ఆనందం లేకుండా చేసిందని మండిపడ్డారు. న్యాయం అడిగితే రైతులను తొకి చంపుతున్న కేంద్ర వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. విద్యుత్తు సవరణ చట్టాలను తెచ్చి రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
చేతనైతే ధరలు తగ్గించండి
రాష్ట్ర బీజేపీ నేతలకు చేతనైతే కేంద్రం పెంచిన ఎరువుల ధరలను తగ్గించేలా ఒప్పించాలని ప్రశాంత్రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం తక్షణం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు, ప్రాంతీయ పార్టీలు రైతు ఉద్యమానికి నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.