Secretariat | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ (Secretariat) ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy) దంపతులు సుదర్శన యాగం (Sudarshana Yagam), చండీ హోమాల్లో పాల్గొన్నారు. ఉదయం 5.50 గంటలకే రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం 6.15 గంటలకు సచివాలయానికి చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు యాగశాలకు హాజరై చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడే జరిగే వాస్తు పూజలో కూడా మంత్రి ప్రశాంత్రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సచివాలయానికి చేరుకొంటారు. ముఖ్యమంత్రికి వేదపండితులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. 1:20 నుంచి 1:32 గంటలకు మధ్య పూర్ణాహుతి నిర్వహించి, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఆరో అంతస్థులోని తన చాంబర్లో ఆసీనులై ఫైలుపై సంతకం చేస్తారు. మంత్రులందరూ తమతమ కార్యాలయాల్లో మధ్యాహ్నం ఒంటి గంట 56 నిమిషాల నుంచి రెండు గంటల నాలుగు నిమిషాల మధ్య ఆసీనులవుతారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాల నుంచి రెండు గంటల 45 నిమిషాల మధ్య సచివాలయం ఉద్యోగులు, మంత్రులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేవారి కోసం ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఆదివారం నుంచే కొత్త సచివాలయం నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.