Minister Prashanth Reddy | ఆర్మూర్ : నరేంద్ర మోదీ అసమర్థ ప్రధాని అని, ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే , పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అధ్యక్షతన నందిపేట, డొంకేశ్వర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని నందిపేటలోని మున్నూరుకాపు సంఘంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా ఎదిగిందని వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వైఖరిపై మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మిత్రుడు అదానీ స్వలాభం కోసం ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేర రూ. 3 వేలకు దొరికే బొగ్గును రూ. 30 వేలకు కొనాలని విద్యుత్ డిస్కంలకు హుకుం జారీ చేశారని మండిపడ్డారు. ఎల్ఐసీ, ఎస్బీఐ, విమానాశ్రయాలు, ఓడ రేవులు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలను మోదీ తన కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతూ దేశ సంపదను దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు.
మోదీ వల్ల దేశంలో ఒక్క వర్గానికి మేలు జరగలేదని, తెలంగాణ రాష్ట్రలో కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్కిట్లు, కులవృత్తులకు ప్రోత్సాహకాలు ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కానీ ప్రధానీ మోదీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర ధరలు పెంచి ఇంట్లో ఉన్న పైసలు గుంజుకొని సామాన్య ప్రజలను గోస పెడుతున్నారన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పసుపు బోర్డు పేరుతో బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసి గెలిచిన ఎంపీ అరవింద్ పత్తా లేకుండా పోయాడని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎద్దెవా చేశారు. కేసీఆర్ పాలన గురించి మాట్లాడే కనీస అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు లేదని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో జీవన్రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయాల నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.