హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ ఘటనల వెనుక టీఆర్ఎస్ పార్టీ ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఈ ఆరోపణలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. మరి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారు? అక్కడ టీఆర్ఎస్ ఉన్నదా..? ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే మూర్ఖపు బీజేపీ నిర్ణయాల వల్ల నేడు దేశ వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. బండి సంజయ్ లాంటి నాయకుల వ్యాఖ్యల వల్లే దేశంలో అశాంతి, అభద్రత ఏర్పడిందన్నారు.
మొన్న కిసాన్ను, నేడు జవాన్ను రోడ్డున పడేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. అగ్నిపథ్ ప్రకటన చేసి.. దేశ రక్షణ కోసం తమ సేవలు అందించాలనుకునే యువతను బీజేపీ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను, మనకు రక్షణగా నిలిచే సైనికులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూడటం సరికాదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.