వేల్పూర్, జనవరి 3: జిల్లాలో గంజాయి మహమ్మారిని అంతమొందించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని సూచించారు. మంగళవారం నిజామాబాద్ సీపీ నాగరాజు, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి పలువురు పోలీస్ అధికారులు నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం గంజాయిపై పోలీస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రాణాంతకంగా మారుతున్న గంజాయి ఎక్కడ నుంచి సరఫరా అవుతున్నది? ముఠా సభ్యులు ఎవరు? మహమ్మారి బారిన పడినవాళ్లు ఎవరు? ఈ జాడ్యాన్ని అంతమొందించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి పలు సూచనలు చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తూ.. సమాజానికి ప్రమాదకరంగా మారిన గంజాయికి అడ్డుకట్ట వేయాలని అధికారులకు సూచించారు. గంజాయి సాగుచేసే వారికి రైతుబంధు కట్ చేస్తామని, కఠిన శిక్షలు కూడా ఉంటాయన్న హెచ్చరికలను తెలియజేయాలని సూచించారు.