TGSRTC | హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు.. రాష్ట్రంలోని శివాలయాలకు పోటెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లోని తన నివాసంలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్ళే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. బస్టాండ్ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడి మునిశేఖర్, సీటీఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప పాల్గొన్నారు.