కరీంనగర్, 27 ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుస్నాబాద్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాలుక, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. నియోజకవర్గం అభివృద్ధిపై తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్.. తన తల్లి గురించి, తన జన్మ గురించి నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వీటిని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు.
ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్గా మంగళవారం ఆయన ఒక వీడియోను విడుదల చేయడమే కాకుండాసిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని, ఆయన యాత్రను తామేదో అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేసుకొంటున్నారని పొన్నం విమర్శించారు. శ్రీరాముడి గురించి మాట్లాడే బీజేపీ నాయకులు తల్లి గురించి, జన్మల గురించి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు బండి సంజయ్ కుట్రలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ హింసను ప్రేరేపించదని స్పష్టంచేశారు. శ్రీరాముడి పేరిట ఓట్లు అడగడం కాదు.. ఎంపీగా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. బండి యాత్రను తాము అడ్డుకోవడం లేదని మంత్రి పొన్నం తెలిపారు.