హైదరాబాద్: హైదరాబాద్ అమీర్పేటలో గృహజ్యోతి పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో ఇంటికి రూ.వెయ్యి విలువైన కరెంటును ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. విపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలని, అనవసరమైన విమర్శలొద్దని సూచించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్లతోపాటు మిగతా వాగ్దానాలు పూర్తిచేస్తామని చెప్పారు. అంతకుముందు ఆయన చింతల్ బస్తీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గత నెల 27న ప్రారంభించిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి నెలకు 200 యూనిట్లు వినియోగించే గృహ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ వర్తింపజేస్తున్నారు. జారీ చేసిన జీరో బిల్లులో వినియోగించిన కరెంటుకు ఎంత చార్జీ అయిందో పేర్కొంటున్నారు. ఆ తర్వాత గృహజ్యోతి సబ్సిడీ కింద ఆ మొత్తాన్ని మైనస్గా చూపిస్తూ నెట్ బిల్ అమౌంట్ జీరోగా చూపిస్తున్నారు.