కరీంనగర్ : అగ్ని ప్రమాదంలో(Fire accident) సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హామీ ఇచ్చారు. కరీంనగర్లోని ఆదర్శనగర్లో మంగళవారం అగ్ని ప్రమాదంలో దాదాపు 21 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. బుధవారం ఉదయం ఘటన స్థలాన్ని మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదంలో బట్టలు, నిత్యావసర వస్తువులు, సర్టిఫికెట్లు దగ్ధం కావడం దురదృష్టకరమని తెలిపారు. వీరికి తాత్కాలికంగా భోజన వసతి, నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
ప్రభుత్వంతోపాటు పార్టీ తరఫున కూడా వారికి సామగ్రి అందిస్తామని చెప్పారు. కొద్ది రోజుల్లో వారికి శాశ్వతంగా కూడా గృహ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. రాజీవ్ స్వగృహతో పాటు వేరే చోట వారు నివాసం ఉండేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసు, స్థానిక కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు, కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్ పాల్గొన్నారు.