భీమదేవరపల్లి, డిసెంబర్ 23 : సిద్దిపేట-ఎల్కతుర్తి ఎన్హెచ్కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జాతీయ రహదారిగా నామకరణం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పీవీ స్వగ్రామం వంగరలో శనివారం పీవీ 19వ వర్ధంతిని నిర్వహించారు. జడ్పీచైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూచించారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామీణాభివృద్ధిని పటిష్ఠం చేశారని గుర్తుచేశారు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని ఐదేండ్లపాటు కొనసాగించారని తెలిపారు. నవోదయ పాఠశాలలను ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి పీవీ గౌరవాన్ని మరింత పెంచే విషయంలో తాను ముందుంటానని తెలిపారు.
హుజూరాబాద్ను పీవీ జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ వంగరలోని పీవీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట పీవీ జిల్లా సాధన సమితి నాయకులు నినాదాలు చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ నిరసనలో పీవీ జిల్లా సాధన సమితి కన్వీనర్ భీమోజు సదానందం, నాయకులు పొడిశెట్టి వెంకట్రాజం, రాచర్ల సారయ్య, పులి లత తదితరులు పాల్గొన్నారు.