సిద్దిపేట అర్బన్, మార్చి 27: బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలికి ఘోర అవమానం జరిగింది. కూర్చోవడానికి కుర్చీ వేయకుండా అవమానించారంటూ ఆమె కంటతడిపెట్టారు. ఈ ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. సిద్దిపేటలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో బుధవారం మంత్రి పొన్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సత్యనారాయణ, డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నా రు. అయితే సమావేశానికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి రాగా.. ఆమెకు కుర్చీ వేయకపోవడంతో సమావేశం ముగిసేవరకు నిలబడి ఉన్నారు. ముద్దం లక్ష్మి మాట్లాడుతూ.. ఓ మహిళా అధ్యక్షురాలినైన తనను అవమానించడం సరికాదంటూ కంటతడిపెట్టారు. ‘పదేండ్లుగా కాంగ్రెస్కు ఎంతో సేవ చేశా.. కనీసం సీటు కూడా ఇవ్వకుండా అవమానించారు’. ఓ మహిళను గౌరవించడం ఇదేనా? ’ అని ఆమె ప్రశ్నించారు.