TGSRTC | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో తమను విలీనం చేయాలని కొట్లాడుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. అందులో భాగంగా అసలు హామీలను గాలికి వదిలేసి కేవలం కరువుభత్యం (డీఏ) పెంపుతో నానా హంగామా చేస్తున్నది. ప్రస్తుతానికి 2.1% డీఏ పెంచుతున్నామని, ఇది ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు.
గత మూడు నెలల డీఏ పెంపు బకాయిలను ఒకో నెలలో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నట్టు తెలిపారు. ప్రస్తుత పెంపుతో కలిపి మొత్తం డీఏ 52.8 శాతానికి పెరిగిందని, దీని వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. అనంతరం ఆర్టీసీలో పెండింగ్లో ఉన్న పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ల మేనేజర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిషారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఈడీలు సీహెచ్ వెంకన్న, ఖుస్రోషా ఖాన్, రాజశేఖర్, సాల్మన్, ఎఫ్ఏ విజయపుష్ప, సీఅండ్ఏం శ్రీధర్, ఉషాదేవి పాల్గొన్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా తమను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ బకాయిలు విడుదల చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే పోరుబాట పట్టారు. అందులో భాగంగా గత నెల 13న ఆర్టీసీ ఉన్నతాధికారులకు, లేబర్ కమిషన్ అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులను, జేఏసీ ప్రతినిధులను లేబర్ కమిషన్ చర్చలకు ఆహ్వానించింది. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలకు రాలేదు. దీంతో మళ్లీ ఏప్రిల్ 9న చర్చలకు రావాలని లేబర్ కమిషన్ కోరినా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు రాకపోవడంతో ఏప్రిల్ 13న కచ్చితంగా రావాల్సిందేనని లేబర్ కమిషన్ స్పష్టం చేసింది.
కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో సమ్మె తథ్యమని కార్మిక జేఏసీ భావిస్తున్నది. సమ్మెతో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారిని ఇప్పట్నుంచే జాగృతం చేస్తున్నది. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని పలు డిపోల్లో సమ్మె కరపత్రాలను పంచారు. అన్ని డిపోల్లో గేట్ మీటింగ్లు నిర్వహిస్తూ తోటి సిబ్బందిని ఉత్సాహపరుస్తున్నారు. మియాపూర్-1 డిపోలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్చైర్మన్ ఎం థామస్రెడ్డి, డిపో జేఏసీ నాయకులు జీబీ గౌడ్, రాఘవేందర్గౌడ్, వెంకటేశ్, ఎస్అశోక్, కే మనోహర్.. ఇబ్రహీంపట్నం డిపోలో జేఏసీ నాయకులు ఎస్ బాబు, కో-కన్వీనర్ కత్తుల యాదయ్య, డిపో జేఏసీ నాయకులు సమ్మె కరపత్రాలు విడుదల చేశారు.