ఖమ్మం, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజే ప్రజలకు ఇచ్చిన హామీల్లో ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించగా, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను క్యాబినెట్ ఆమోదించి వాటికి చట్టబద్ధత కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎన్ని అడ్డుంకులు వచ్చినా 24 గంటల కరెంట్ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులందరికీ పథకాలను అందేలా చూస్తామని అన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకూ స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన అందించి అభివృద్ధి, సంక్షేమంతో ముందుకెళ్తామని తెలిపారు.