హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అనంతరం రెండు ఫైళ్లపై తొలిసంతకాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ మొదటి సంతకం చేశారు.
రూ.9.5 కోట్ల విలువైన భూమిలో మల్టిపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు యువజన, క్రీడల శాఖకు బదలాయించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల డీపీఆర్వోలకు అధునాతన కెమెరాలు అందజేసేలా సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన ఫైల్పై మంత్రి తొలి సంతకం చేశారు. గృహ నిర్మాణ శాఖకు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేశారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలునాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీరెడ్డితోపాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్రెడ్డి తదితరులు మంత్రికి అభినందనలు తెలిపారు.
ప్రజలను చైతన్యం చేయాలి
బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి పొంగులేటి సమాచార శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచారశాఖ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్య వంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతోపాటు సోషల్ మీడియా వింగ్ను విసృ్తతంగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ మాస పత్రికను మరింత ప్రామాణిక పత్రికగా తీర్చిదిద్దడంతోపాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజాప్రతినిధులకు, సామాన్య ప్రజలకు అందుబాటులో తేవాలని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్ర స్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించారు. సమాచారశాఖతోపాటు మీడియా అకాడమీ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార కమిషనర్ అశోక్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
ఆయా కార్యక్రమాల్లో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, సమాచారశాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీలు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీలు మధుసూదన్, హాష్మి, రాజారెడ్డి, సురేశ్ , సీఐఈ రాధాకిషన్, ప్రాంతీయ సమాచార ఇంజినీర్ జయరామ్మూర్తి, రాములు, అకౌంట్స్ ఆఫీసర్ పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు.