హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలు అందలేదని, పేదలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు గ్రామ రెవెన్యూ సహాయకులను నియమించాలని యోచిస్తున్నామని, ఇందుకు ఒక కమిటీని శనివారం నియమించామని తెలిపారు. ఇందులో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్), రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారని, సీసీఎల్ఏ కార్యదర్శి సభ్య కార్యదర్శిగా కొనసాగుతారని చెప్పారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా తమ నివేదికను అందిస్తుందని వెల్లడించారు.