Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): కండ్ల ముందు తమ ఇండ్లు కూలగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పుట్టెడు దు:ఖంతో కుమిలిపోతున్న బాధితులపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రేలాపనలు చేశారు. వారిని కించపరిచేలా, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారందరినీ పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారు. వాళ్లలో ఎవరూ నిజమైన బాధితులు కాదనేలా వ్యాఖ్యానించారు.
ఈ మేరకు హైదరాబాద్లోని సచివాలయంలో గురువారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతున్నదంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఓవైపు కండ్ల ముందు ఇండ్లు కూలగొడుతున్నప్పటికీ వాటిని ఆయన సమర్థించుకోవడం గమనార్హం.
ఓ వైపు పేదల ఇండ్లు కూలగొడుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తూనే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా తమది పేదల ప్రభుత్వమని, తమ పేటెంటే పేదోళ్లని, వాళ్ల ఆశీర్వాదంతోనే ప్రభుత్వం నిలబడిందంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ ప్రభుత్వం నిజమైన పేదలను ఎప్పుడూ విస్మరించబోదని, వారిని ఇబ్బందులు పెట్టబోదని చెప్పారు. ఒకవేళ ఇండ్లు కోల్పోతున్న వారిలో పేదవాళ్లు, నిరుపేద అభాగ్యులెవరైనా ఉంటే వారిలో అర్హులైన వారికి, గతంలో ఏ పథకం తీసుకోని వారికి తగు న్యాయం చేస్తామని తెలిపారు. అంతేగానీ పేదల ఇండ్ల కూల్చివేతను ఆపేస్తామని మాత్రం మంత్రి చెప్పలేదు. అంటే ఇకపై కూడా పేదల ఇండ్ల కూల్చివేత కొనసాగుతుందని ఆయన పరోక్షంగా చెప్పడం గమనార్హం.