Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): నాదర్గుల్ భూముల బండారం బయటపడటంతో మంత్రి పొంగులేటి తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నది. బుధవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశం మొత్తం ఇదే ప్రస్ఫుటంగా కనిపించింది. తనపై వచ్చిన తీవ్ర అభియోగాలకు సమాధానం చెప్పలేక, పిట్టకథతో విషయాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించిన మంత్రి.. చివరికి తానే అందులో బురదచల్లే పాత్రలా మారిపోయానని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
ఏమిటీ మంత్రి చెప్పిన కథ? ‘ఒక అడవిలో పంది (తర్వాత దాన్ని అడవిపందిని చేశారు. అచ్చం నాదర్గుల్ భూముల్లో బోర్డును మార్చినట్టే), సింహం ఎదురుపడ్డాయట. నువ్వు నన్నేం చేయలేవు అంటూ అడవిపంది ప్రేలాపనలు పేలుతున్నదట. సింహం రెండు అడుగులు ముందుకు వేసే సరికి, అడవిపంది పక్కనే ఉన్న పెద్ద బురద గుంతలోకి వెళ్లి.. ఆ బురదనంతా ఒంటికి పూసుకొని.. ‘ఇప్పుడు రా చూసుకుందాం’ అన్నదట. సింహం కోపంతో అడవిపందిని అక్కడే తొక్కేసిందట!’ ఇదీ మంత్రి కహానీ! అడ్డంగా దొరికిపోయి అడ్డగోలు మాటలు! అడవిపంది కథలు!
వట్టినాగులపల్లి, కొత్వాల్గూడలో భూముల ఆక్రమణ బురద అంటించుకుని.. దాన్ని నాదర్గుల్లోనూ ఒంటికి రాసుకుని, బోర్డులపైనా రాసింది ఎవరు? బోర్డులు తిప్పేసిందెవరు? తమ పొలాల్లోకి చొరబడి, తమ భూముల్ని మెక్కుతున్న ఏ పంది గురించి నాదర్గుల్లో రైతులు ఆందోళన చేస్తున్నరు? ఎవరికివారు సింహం అనుకుంటే సింహమైపోరన్న విషయం.. అడవిపందిని కాను అని అనుకున్నంత మాత్రాన కాకుండాపోరన్న విషయం మంత్రికి తెలువకపోదు. రాఘవకు, తనకు సంబంధం లేదంటూనే.. ఆ కంపెనీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న మంత్రి సచ్ఛీలత.. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే బయటపెట్టింది. రాఘవ కంపెనీ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రే ఎందుకు ఆదేశించారు?
పొంగులేటి చెప్తున్న అడవిపంది ప్రభుత్వంలోనే తిరుగాడుతున్నట్టున్నది. నమస్తే తెలంగాణ, బీఆర్ఎస్ ఆయన అవినీతిని బయటపెడితే.. దానికి వివరణ ఇచ్చుకునేందుకు మీడియా ముందుకు వచ్చి.. సహచరు మంత్రులపైనా అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తుచేసి మరీ తన క్యాబినెట్కు బురద అంటించిందెవరు? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై నైని కోల్బ్లాక్ ఆరోపణలు చేసింది నమస్తే తెలంగాణో, బీఆర్ఎస్సో కాదు. ప్రభుత్వ అనుకూల మీడియా.. మరీ ముఖ్యంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఎన్-టీవీ! ఆ బురద అంటించే కార్యక్రమం ప్రభుత్వంలోని వారే ఎలా నడుపుతున్నారో నేరుగా భట్టి విక్రమార్కే మీడియా ముందు ఆవేదన వ్యక్తంచేసిందీ చూశాం. అదంతా బీఆర్ఎస్, నమస్తే తెలంగాణ పనే అన్నట్టు పొంగులేటి మాట్లాడటం చూస్తుంటే నిజమేంటో కూడా తెలుసుకోలేని ఆయన ఫ్రస్ట్రేషన్.. నవ్వు తెప్పిస్తున్నది! అభియోగాలు వచ్చినప్పుడు.. ఆధారాలు ముందుపెట్టాలి! కాదని, అబద్ధాలు వల్లెవేస్తే.. పిట్టకథల పిట్టగోడల మాటున దాక్కుని, తానేదో పరమపవిత్రుడిని అనుకుంటే.. పోయేది మంత్రి పరువు ఒక్కటే కాదు, క్యాబినెట్, కాంగ్రెస్ ప్రభుత్వం పరువు కూడా! ‘రాజుగారి దేవతావస్ర్తాల కథ’.. కథలు చెప్పే మంత్రికి తెలియదా?