హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశాం. ఈ నెల 11న భద్రాచలం రాములోని సన్నిధిలో ఐదవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్ల (Indiramma houses )పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) తెలిపారు. నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సహాయం అందించడానికి అవసరమైన కార్యచరణను ప్రారంభించిందన్నారు.
బుధవారం సచివాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతగా ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. తొలి విడతలో సొంత స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నామని, 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఇండ్లను నిర్మించాలని, హాలు, బెడ్ రూమ్ తో పాటు వంటగది, బాత్ రూమ్ తప్పనిసరిగా ఉండాలన్నారు.
మహిళల పేరుపైన ఇండ్లను మంజూరు చేస్తామని, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్దిదారుల ఎంపిక చేస్తారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంభందించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు.