హనుమకొండ, ఫిబ్రవరి 19: తెలంగాణ సిద్ధించిన తర్వాతనే గిరిజనులకు గౌరవం పెరిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం హనుమకొండ ఆర్ఈసీ సమీపంలో ని తారా గార్డెన్లో ప్రొఫెసర్ పోరిక రామూనాయక్ అధ్యక్షతన జరిగిన బంజారాల ఆత్మీయ సమ్మేళనం, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నదని అన్నారు. జానాభాకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు.
సేవాలాల్ మహరాజ్ ఆదర్శ పురుషుడని కొనియాడారు. సేవాలాల్ సేవలు, బోధనలు ప్రపంచానికే ఆదర్శమని పేర్కొన్నారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్టు చెప్పారు. జీపీలు ఏర్పాటు చేసి రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, మౌలిక వసతులు కల్పించినట్టు తెలిపారు. కేసీఆర్ చొరవతో తండాలు, గూడేలు అన్ని బాగుపడ్డాయని వివరించారు. గిరిజన ఆవాసాలకు త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించామని అన్నారు. 26న పాలకుర్తిలో ఎకరం స్థలంలో రూ.2 కోట్లతో సేవాలాల్ భవన్కు శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయించినా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదని విమర్శించారు. అదే ఏపీలో భూమి ఇవ్వకపోయినా యూనివర్సిటీ ఇచ్చారని మండిపడ్డారు. అలాగే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇప్పటికీ కల్పించలేదని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.