హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తె లంగాణ): ఆదాయ పన్ను చెల్లింపుల్లో తెలంగాణ అగ్రపథాన నిలిచింది. 2019-20తో పోలిస్తే గత ఏడాదిలో 24.75% వృద్ధిరేటును నమోదు చేసింది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు. సోమవారం లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణలో ఆర్థిక, సాంకేతిక వృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉత్తమ పన్ను విధానాల వల్ల ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)లు గణనీయంగా పెరిగినట్టు ఆమె అంగీకరించారు. తెలంగాణలో 2019-20లో 21.58 లక్షలుగా ఉన్న ఐటీ రిటర్నుల సంఖ్య 2022-23లో 26.92 లక్షలకు చేరింది. నాలుగేండ్లలోనే ఐటీ రిటర్నులు 5.34 లక్షలు (24.75 శాతం) పెరిగాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 6.78 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలవగా.. 2022-23లో వాటి సంఖ్య 7.78 కోట్లకు చేరింది. వీటితో పోలిస్తే తెలంగాణ 10 శాతం అధిక వృద్ధిరేటును నమోదు చేసింది.