హైదరాబాద్ : నానో యూరియా సాధారణ రైతు బిడ్డ విజయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను మంత్రి శనివారం సందర్శించారు. ఇఫ్కో వైస్ చైర్మన్, జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీ దిలీప్ సంగానియా, ఇఫ్కో కలోల్ యూనిట్ హెడ్ ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేష్ రాలియా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త రమేష్ రాలియాను మంత్రి అభినందించి, సన్మానించారు.
రమేష్ రాలియా బయో (నానో) టెక్నాలజీలో ఏడేళ్లు అమెరికాలో పరిశోధనలు చేసి తన జ్ఞానం, తన పరిశోధనా ఫలాలు అత్యధిక మంది రైతులున్న భారతదేశానికి ఉపయోగపడాలని దేశానికి తిరిగివచ్చి ఇఫ్కోలో చేరి మరో మూడేళ్లు పరిశోధనలు చేసి లిక్విడ్ నానో యూరియాను కనిపెట్టడం గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. 500 ఎంఎల్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ను 127 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే ఎకరాకు సరిపోతుందన్నారు. కేవలం రూ.240కి లభించే ఈ బాటిల్ మూలంగా ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున సబ్సిడీ భారం తప్పుతుందన్నారు.
ఇఫ్కో భారత రైతాంగ సహకార సంస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది మనది కావడం మనకు గర్వకారణం. అటువంటి ఇఫ్కో సంస్థ పరిశోధనల నుండి ప్రపంచ పేటెంట్ కలిగిన నానో యూరియా రావడం దానిని ప్రపంచానికి అందించడం మన దేశ సౌభాగ్యానికి తోడ్పడుతుంది. ఇది వ్యవసాయంలో ఎరువుల వాడకంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుంది. భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదేనన్నారు. నానో యూరియాతో భూసారం పెరగడంతో పాటు, పంట దిగుబడి శాతం సాధారణం కన్నా 8 శాతం అధికంగా ఉంటుందన్నది పరిశోధనలలో తేలిందన్నారు.
ప్రభుత్వపరంగా భూమితో పాటు ఇతర సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అండతో అన్ని రకాల సహకారాలు అందిస్తామని తెలిపారు. దక్షిణ తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు మూలంగా కశ్మీర్ – కన్యాకుమారి, ముంబయి – విజయవాడ – కోల్కతా రహదారులు అందుబాటులో ఉండడంతో మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లకు అందుబాటులో ఉంటుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో నానో యూరియా విస్తృత వాడకానికి సహకారం అందించాలన్నారు. రైతులు దీనిని విరివిగా వాడేలా ప్రోత్సాహం అందించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ప్రోత్సహించడంతో సాగులో ఎరువులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని రైతులను చైతన్యం చేయడం జరుగుతుందన్నారు. పెరిగిన సాగు దృష్ట్యా తెలంగాణలో ఇఫ్కో నానో యూరియా ప్లాంటును ఏర్పాటు చేయాలని ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంగానియాకు విజ్ఞప్తి చేశారు. ఎరువుల వాడకంలో సాంప్రదాయ పద్దతులతో నష్టపోతున్న రైతాంగాన్ని నానో ఎరువుల వైపు మళ్లించడం మూలంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు మొదలవుతుందన్నారు.