హైదరాబాద్ : రైతులను చైతన్యం చేయడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా సంస్థలో జిల్లా వ్యవసాయాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి సాగు నుంచి రైతుల దృష్టిని మళ్లించాలని, అధికారులు మనసుపెట్టి చేస్తే రైతులు మంటల మార్పిడి వైపు మళ్లించడం అసాధ్యమేమీ కాదన్నారు. మినుములు, పెసర్లు సాగు చేయడం ద్వారా వానాకాలం సాగులో ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చనే విషయాన్ని రైతులకు తెలుపాలన్నారు.
కుసుమలు, ఆముదాల సాగును తిరిగి చేపట్టేలా చూడాలని, ఆముదాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉందన్న ఆయన.. దేశంలో తగినంత ఉత్పత్తి లేదన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు సమన్వయంతో పని చేయాలని, డీఏపీ తెలంగాణ భూములకు అక్కర్లేదని, ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించేలా రైతులను చైతన్యం చేసి.. తద్వారా పెట్టుబడి తగ్గేలా చూడాలన్నారు. రైతు వేదికల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని. నాణ్యమైన ఫర్నీచర్ను తీసుకోవాలని సూచించారు. రైతువేదికల స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేద్దామంటూ అధికారులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఏర్పాటు జరిగినప్పటి నుంచి వ్యవసాయరంగంలో అనేక మార్పులపై సమీక్ష నడుస్తూనే ఉన్నదని, యాసంగిలో వరి సాగు వద్దనే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. దేశంలో ఆహారాధాన్యాలను సమతుల్యం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి సాధించే రాష్ట్రం తెలంగాణ అన్నారు. పప్పుగింజలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉందని, ఈ విషయం రైతులకు అర్థమయ్యేలా చెప్పేందుకు రాష్ట్ర స్థాయి బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా పంటల మార్పిడిపై రూపొందించిన కరపత్రాలను మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.