‘అగ్నిపథ్ స్కీం’ అనేది కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయమని మంత్రి సింగిరెడ్డి
నిరంజన్రెడ్డి మండిపడ్డారు. త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం’పై శుక్రవారం ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, అగ్నిపథ్ స్కీం కింద 46 వేల మందిని 90 రోజుల్లో నియమించి, కేవలం రూ.30 వేల జీతం ఇస్తామనడంలో అర్థంలేదన్నారు. దేశ భద్రత విషయంలో ఇంత అనాలోచిత నిర్ణయం ఎలా తీసుకున్నారో అర్థంకావడం లేదన్నారు.
పదో తరగతి పాసైనవారు ‘అగ్నిపథ్’లో చేరి తిరిగి వెళ్లేటప్పుడు 12వ తరగతి పాసైన సర్టిఫికెట్ ఇస్తామనడం సిగ్గుచేటని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. వారిని దేశ రక్షణ కోసం తీసుకుంటున్నారా? లేదా అప్రెంటిస్ సర్టిఫికెట్ కోసం తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మొన్న నల్ల చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్నారని, నేడు యువత జీవితాలతో ఆడుకుంటున్నారని బీజేపీ సర్కారుపై ధ్వజమెత్తారు. నల్లధనం తెచ్చి..ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని దేశప్రజలను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయం కొల్లగొట్టారని మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావుశేరు కింద అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుంచి 7.83 శాతానికి పెరిగిందన్నారు. ఆకలిసూచీలో 110 దేశాల్లో భారత్ 101వ స్థానంలో నిలువడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
మోడీది మోసాల పాలన అని మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశప్రజలు , దేశ యువత జాగృతం కావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతిచెందడం, మరికొంతమంది గాయపడడం బాధాకరమన్నారు. మృతిచెందిన యువకుడి కుటుంబంతోపాటు గాయపడ్డవారందరికీ కేంద్రం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలకు కేంద్రం బాధ్యత వహించాలని కోరారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు సాగుతున్నాయని, యువత ఆగ్రహాన్ని గమనించి అయినా కేంద్రం తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డి కోరారు.