హైదరాబాద్ : రైతు సంఘర్షణ పేరిట రేపు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడా చూసినా రైతన్నల మరణ మృదంగ విషాదమే కాదా? అని ప్రశ్నించారు. దశాబ్దాల పాటు నాటి కాంగ్రెస్ పార్టీ పాలన పాప ఫలితం వల్లే వ్యవసాయ రంగం దయనీయమైన స్థితికి చేరుకుందన్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘర్షణ సభకు వస్తున్న రాహుల్ గాంధీకి నిరంజన్ రెడ్డి బహిరంగం లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీ అంతులేని వైఫల్యాల చరిత్రను ఒక్క లేఖలోనో.. ఒక్క మాటలోనో చెప్పడం సాధ్యం కాదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడచూసినా రైతన్నల మరణమృదంగ విషాదమే కాదా? ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారమే 1,58,117 మంది రైతులు అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేండ్ల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రైతాంగానికి ఒరిగింది శూన్యమని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నిలకడలేని కరెంట్, అర్ధరాత్రి కరెంట్తో అనేక మంది పాముకాటుకు, విద్యుత్షాక్లకు గురై వేలమంది మరణించింది నిజం కాదా? పండించిన పంటను కొనమని, బకాయిలు అడిగిన ఎర్రజొన్న రైతులను కాల్చి చంపిన కర్కశ పాలన కాంగ్రెస్ది కాదా? నాడు రైతులపైన తుపాకి తూటాలు పేల్చిన మీరు ఇయ్యాల రైతు సభలు పెడ్తరా…? ప్రభుత్వ భూములు పంచాలని, పేదలకు ఇంటి జాగాలు పంచాలని డిమాండ్ చేస్తూ జరిగిన ముదిగొండ ధర్నా మీద కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? బుల్లెట్లు కురిపించి రైతులను పొట్టన పెట్టుకున్న పాపానికి, ముందు క్షమాపణలు చెప్పండని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపాలని నీచమైన రాజకీయాలు చేసిన కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతారా.? అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతాంగాన్ని రక్త కన్నీరు పెట్టించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అన్నదాత ఎన్నటికీ క్షమించడని స్పష్టం చేశారు.
వరిధాన్యం కొనుగోలుపై మోడీ సర్కారు మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతులు ఆందోళనకు దిగినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడుకున్నారని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తామని సభలు ఎందుకు పెట్టరు? వ్యవసాయం మీద, రైతుల కష్టాల మీద రాహుల్ గాంధీకి ఉన్న అవగాహన ఏంటి? రాహుల్ గాంధీ వ్యవసాయం గురించి మాట్లాడటం అంటే అదొక వింత కాదా? అని ప్రశ్నించారు.
58 ఏండ్ల అన్యాయాలను కేవలం ఎనిమిదేండ్ల పాలనలో తుడిచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ లాంటి పథకాలకు ఈ ఎనిమిదేండ్లలో రూ. 3 లక్షల 80 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కార్ది అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలని మీ కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి లేఖలు రాస్తూ రైతు ద్రోహానికి పాల్పడుతున్నారు. భవిష్యత్లో రైతులకు కరెంట్ కష్టమే రానివ్వకుండా.. తాము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ చేపడుతుంటే.. అధికారంలో వస్తే దాన్ని మూసేస్తామని మీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రకటనలు చేస్తున్నారు.. దీనికి మీరేం సమాధానం చెబుతారని రాహుల్ను నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.