వనపర్తి : తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలనదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం పట్ల ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం వీఆర్ఎలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని పేర్కొన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వివిధ శాఖలలో నియమించామని, వచ్చిన అవకాశాన్ని సంతోషంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన ప్రతి వర్గాన్ని గుర్తించి చేరదీస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో జీవించాలని 23 వేల మంది వీఆర్ఎలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వ ఉద్యోగులుగా (Government Employees) గుర్తించారని వెల్లడించారు.
గతంలో గ్రామ సేవకులు అనే అనాగరిక భాషను తొలగించి వీఆర్ఏలు అని పేరు మార్చామని, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులను చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక జీతాలు అందుకుంటున్నది తెలంగాణ రాష్ట్రంలోనేనని వెల్లడించారు.
ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణది దేశంలో అగ్రస్థానమని అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.