వనపిర్త : తిరులమయ్య గుట్ట వనపర్తికే తలమానికమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శ్రావణమాసం సందర్భంగా తిరుమలయ్యగుట్టను మంత్రి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా తిరుమలేశుడిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అంజనేయస్వామి ఆలయం వద్ద అన్నదానంలో పాల్గొన్నారు. భక్తులకు మంత్రి స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
అరుదైన వనమూలికలకు తిరుమలయ్య గుట్ట అటవీప్రాంతం ప్రసిద్ధి అనీ, ఈ ప్రాంతంలో మరింత పెద్ద ఎత్తున మొక్కలను పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
తిరుమలయ్య గుట్ట చుట్టూ సుందరీకరణ గుట్ట పైకి వెళ్లేందుకు రహదారి వెంట మెట్లు ఏర్పాటు చేస్తామని, వాహనాలకు ఇబ్బంది లేకుండా, పాదాచారులకు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతామన్నారు. గుట్టమీద నీటి సౌకర్యం కల్పిస్తామని, వాహనాల పార్కింగ్కు శాశ్వత ఏర్పాట్లు చేస్తామన్నారు. అన్నిరంగాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందుతుందన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, ఆసరా పింఛన్లు తెలంగాణలోనే విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్న ఘనత కేసీఆర్దేనన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 140 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.44.52లక్షల విలువైన చెక్కులను అందజేశారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి ఉన్నారు.