వనపర్తి : ఎత్తైన ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికతో సాగునీరు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చుట్టూ నీరున్నా పొలాలకు నీరందక రైతులు నిరాశ పడ్డారని మంత్రి తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు అడవిలో నీటికి అడ్డుకట్ట వేసి నీటి మళ్లింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. గోపాల్పేట మండలం బుద్దారం శివారులో జాగీర్దార్ కాల్వకు సాగునీటిని విడుదల చేసిన సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
4.5 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి సాగునీటి వసతి కల్పించామని స్పష్టం చేశారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని 100 ఏండ్ల క్రితం నాటి జాగీర్దార్ కాలువకు పునరుజ్జీవం కల్పించామన్నారు. ఈ కాలువ కింద 4 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు. కాలువ కింద భూమి కోల్పోయిన రైతులందరికీ త్వరలో పరిహారం ఇస్తామన్నారు. జాగీర్దార్ కాలువతో బుద్దారం, పొలికెపాడు, చెన్నూరు గ్రామాలు, నాలుగు తండాలు, గోపాల్ పేట శివారు రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. కాలువ పక్కన ఉన్న రైతులు కాలువ కోసం కేటాయించిన భూమిని సాగు చేయొద్దు అని కోరారు.
తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం రైతే అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి తొలి ప్రాధాన్యం ఇచ్చి రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సాగునీటి రాకతో గ్రామాలకు వలసలు తిరుగుముఖం పట్టాయన్నారు. మన గ్రామాలు భవిష్యత్ లో దేశానికి దిక్సూచిగా నిలుస్తాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.