వనపర్తి : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పల్లెలు నేడు సుభిక్షంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఎంజే 1 కాలువలను పరిశీలించి కృష్ణా జలాలకు పూలుచల్లి మంత్రి నిరంజన్ రెడ్డి పూజలు చేశారు. అనంతరం రేవల్లి మండలం చెన్నారంలో క్రికెట్ పోటీల్లో పాల్గొని గ్రామ పంచాయతీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతలు సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుంది అని అన్నారు. రైతులు సంతోషంగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రమపద్దతిలో వ్యవసాయ అభివృద్దికి చిత్తశుద్దితో పనిచేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గంలో సాగునీటి వసతి కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. మట్టిమనుషులను, రైతులను ఎంత ప్రేమిస్తే అంతమంచిది. మనమంతా వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్లమే. ఎవరమూ మన మూలాలను మరవొద్దు అని మంత్రి సూచించారు.
అన్నిరంగాల అధికారులు తమ తమ విధులను సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. గ్రామ సీమలు గతంలో కరువుకు నిలయంగా, అపరిశుభ్ర వాతావరణంతో నిండి ఉండేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు పూర్తి మౌళిక సదుపాయాలతో పరిశుభ్రంగా ఉన్నాయి. ప్రజలంతా ఎక్కడికక్కడ అన్ని వసతులతో సంతోషంగా జీవించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పల్లెలు విడిచి ప్రజలు పట్టణాలకు వలస పోవడంతో హైదరాబాద్ వంటి నగరంలో ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని వసతులు కల్పించినా సరిపోవడం లేదు అని మంత్రి గుర్తు చేశారు. పల్లెలను విడిచి పట్టణాలకు వలసలు నాగరిక సమాజానికి మంచిది కాదు. తెలంగాణలో వలసలు వాపస్ వస్తున్నాయి .. ఇది ఎంతో ఆనందదాయకం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
గతంలో పండగలు ఎన్నో ఇబ్బందులతో నిర్వహించుకునేది. ఈ ఆ పరిస్థితి తప్పిపోయింది. గ్రామీణ ప్రాంతాలకు అడుగుపెడుతుండగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ పాలన కనిపిస్తుంది అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నూతన రహదారులు, మౌళిక సదుపాయాలతో దర్శనమిస్తున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తే వారు ఆదరిస్తారు అని మంత్రి పేర్కొన్నారు.