వనపర్తి : తెలంగాణ ఉద్యమ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఊహించని అభివృద్ధి జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించిన వనపర్తి కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఎస్పీ కార్యాలయాలను సింగిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత శిక్షణ పొందుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
కలెక్టరేట్ పరిపాలనా భవనం, ఎస్పీ కార్యాలయాలు ఇంత సౌకర్యంగా ఉంటాయనుకోలేదన్నారు. సమస్యల మీద వచ్చిన ప్రజలకు అధికారులందరూ ఒకేచోట ఉండడం ఉపయోగకరంగా ఉన్నదని స్పష్టం చేశారు. గతంలో ఒక్కో కార్యాలయం ఒక్కో చోట ఉండడం మూలంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ఇప్పుడు జిల్లా స్థాయి కార్యాలయాలు, అధికారులు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుకు, తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, జేఎన్టీయూ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు వనపర్తిలో ఏర్పాటు చేయడం భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో ఇంత మార్పు ఉంటుందని అస్సలు ఊహించలేదని స్పష్టం చేశారు. మన రాష్ట్రం – మన పాలన ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుంది? ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది? అన్నదానికి వనపర్తి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమని పేర్కొన్నారు.