వనపర్తి, నవంబర్ 6 : ప్రతిపక్ష పార్టీల నాయకులు (Opposition leaders) వ్యక్తిగత దూషణలతోనే రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలకు ఏం చేస్తామనేది ఎక్కడా ఎవరూ చెప్పడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) మండిపడ్డారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి పాలకులు చేయలేని అభివృద్ధిని తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత ఐదేండ్లలోనే చేసి చూపించానన్నారు.
నాటి నుంచి నేటి వరకు సంప్రదాయ రాజకీయాలను మాత్రమే చూశామని, కానీ నేడు ఎన్నికల కోసం విపక్షాలు దిగజారుడుతనంతో కండ్ల ముందున్న అభివృద్ధిని చూసి కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గత 30 ఏండ్లులో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండున్నరేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. వనపర్తిలో మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, వ్యవసాయ, మత్స్య కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.
రోడ్ల విస్తరణతో వనపర్తి రూపురేఖలు పూర్తిగా మారిపోయాన్నారు. నియోజకవర్గంలో డీ-8 కాల్వల ద్వారా చెరువులను నింపి 95 శాతం సాగునీళ్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి శ్రీధర్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.