హైదరాబాద్, అక్టోబర్19 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నదని బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనపై, సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లక్ష కోట్లే ఖర్చు కాని కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని అసంబద్ధంగా మాట్లాడటం రాహు ల్ అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నా రు. కుటుంబపాలన, అవినీతి గురించి రాహుల్, కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
రాహుల్ ప్రసంగం చూసి అందరూ నవ్వుకుంటున్నారని, కనీస సమాచారం లేకుండా రుణమాఫీ జరగలేదంటున్నారని, 23 లక్షల మందికి ఈ దఫాలో రూ.13 వేల కోట్లను మాఫీ చేశామని చెప్పారు. కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటలకు మించి విద్యుత్తు సరఫరా చేయలేమంటూ స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి చేతులెత్తేశారని, హామీ మేరకు బియ్యం ఇవ్వలేక నగదు ఇవ్వాలని చూస్తున్నారని తెలిపారు. అక్కడ అమలుగాని గ్యారెంటీలు ఇకడ అమలవుతాయా అని ప్రశ్నించారు. రాహుల్ తెలంగాణ రైతుల పక్షాన ఏనాడూ మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కాం గ్రెస్ పార్టీకి దమ్ముంటే దేశమంతా ఉచిత కరెం టు ఇస్తామని ప్రకటించాలని సవాల్ విసిరారు.
ఏ గ్యారెంటీల్లో లేకున్నా పీసీసీ అధ్యక్షుడు తులం బంగారం ఇస్తామంటూ వాగ్దానం చేస్తున్నారని, అది నోరా ఇంకేమైనా అని విమర్శించారు. కాంగ్రెస్ పాపాలను తెలంగాణ సమా జం ఎన్నటికీ మరచిపోదని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రాహుల్ రాష్ర్టానికి ఎన్నిసార్లు వచ్చినా, పొర్లుదండాలు పెట్టినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదని, బీఆర్ఎస్ గెలుపు తథ్యమని మంత్రి స్పష్టం చేశారు.