హైదరాబాద్, జులై 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని మరింత పెంచాలని ఉద్యానవన శాఖ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో గురువారం కూరగాయల సాగుపై సమీక్ష నిర్వహించారు.
తగ్గుతున్న కూరగాయల ఉత్పత్తి, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన సౌకర్యాలను విశ్లేషించాలని, దిగుబడుల నిల్వ కోసం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.