హైదరాబాద్: పంజాబ్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోనే డిక్లరేషన్ చేస్తరా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డిక్లరేషన్ చేయరా అని ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 75 ఏండ్ల కాలంలో రైతుబీమా గురించి ఏనాడైనా ఆలోచించారా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధుతో రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ చేసిందన్నారు. 2017లో పంజాబ్ రైతులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని, అందుకే అక్కడి ప్రజలు కాంగ్రెస్ను ఈడ్చి తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి అసలు యంత్రంగమే లేకుండా పోయిందని చెప్పారు. కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు ఎప్పుడో శిక్షించారని చెప్పారు. 2014లో ఎన్నికల్లో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పినప్పటికీ.. రూ.లక్ష మాఫీ చేస్తామన్న టీఆర్ఎస్నే తెలంగాణ ప్రజలు నమ్మారని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.
అసలు ఎందుకు వచ్చారో రాహుల్కే తెలియదని, ఇవాళ ఏం మాట్లాడాలని అడగడంతోనే ఆయన చిత్తశుద్ధి తెలుస్తున్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎవరో భిక్షమిచ్చింది కాదని, వేలాది మంది బలిదానం, పోరాటాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ పచ్చబడుతున్నదని వెల్లడించారు. నిన్న, మొన్న కాంగ్రెస్ను బూతులు తిట్టినోడే నేడు ఆ పార్టీకి సారథి అని మంత్రి విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
దేశంలో అరాచక పాలనకు కాంగ్రెస్ దోహదపడిందని విమర్శించారు. ప్రతిపక్షంగా పోషించాల్సిన పాత్ర కాంగ్రెస్ పోషించడం లేదని చెప్పారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏనాడైనా కాంగ్రెస్ పోరాడిందా అని ప్రశ్నించారు. స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఉందని.. కానీ కాంగ్రెస్దే ప్రధాన పాత్రలేదని, ఆ పార్టీ పుట్టకముందే స్వాతంత్ర ఉద్యమం నడిచిందని మంత్రి అన్నారు.