వనపర్తి: భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేక విశిష్టత ఉన్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 74 ఏండ్ల క్రితం ఇదే రోజున భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిందని, రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్యదశలోకి పరివర్తన చెందిందన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా వనపర్తిలోని ఐడీఓసీ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
ఆగస్టులో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు వైభవంగా జరుపుకున్నామని తెలిపారు. ఇప్పుడు మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు.