హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా (Fasal bima) పథకం విఫలమైందని, రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యే పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. రాష్ట్రంలో పంటల బీమా నిలిపివేత, అతివృష్టితో నష్టపోయిన రైతులకు పరిహారంపై శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. వర్షాలతో నష్టపోయిన ఏ పంటైనా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. బాధితులకు ఇప్పటికే రూ.151 కోట్లు అందించామన్నారు. త్వరలోనే మరో 160 కోట్లు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగేండ్లపాటు కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమాను అమలుచేశామని, దీనిద్వారా రూ.500 కోట్లు నష్టపోయామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంతో సంబంధం లేకుండా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు.