వనపర్తి: స్వాతంత్య్రం అంటే ఒక్క రోజు చేసుకునే వేడుక కాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని వారు, బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా వ్యవహరించిన వారు నేడు ఈ దేశానికి ప్రభువులుగా ఉన్నారని విమర్శించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వనపర్తిలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేశారు, భగత్ సింగ్ ఉరికంబానికి సిద్ధమయ్యారు.. ఇలా దేశంలో ఒక్కోచోట ఒక్కోవిధంగా ప్రజలను స్వాతంత్య్ర సంగ్రామం వైపు కదిలించారని చెప్పారు. ఎవరు ఏ దారిని ఎంచుకున్నప్పటికీ అందరి లక్ష్యం భారతమాత సంకెళ్లను తెంచడంకోసమేనని వెల్లడించారు. ఆ రోజు మన పెద్దలు స్వాతంత్య్రం కోసం పోరాడకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని బృందం భారత రాజ్యాంగాన్ని రచించారని, దానిప్రకారమే దేశంలో పాలన, న్యాయ, శాసన వ్యవస్థలతో పాటు అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయని చెప్పారు. ఏది చేసినా రాజ్యాంగానికి విఘాతం కలగకుండా ముందుకుసాగాలని సూచించారు.
స్వాతంత్య్రం విలువ, దానికోసం చేసిన త్యాగాలు ఈ తరానికి, భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మొక్కుబడిగా కాకుండా 15 రోజులపాటు విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ నెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సవ వేడుకలను జరుపుతున్నామని వెల్లడించారు.