హైదరాబాద్ : వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. నిత్యం వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచించారు. వనపర్తి జూనియర్ కళాశాల మైదానంలో రిటైర్డ్ సైనికుడు శివశంకర్ రూ.4 లక్షలతో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను ప్రారంభించారు. అనంతరం ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఈ విషయంలో శ్రద్ధ లోపించిందన్నారు.
సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల మోజులో యువత, పిల్లలు, పెద్దలు వ్యాయామానికి దూరమవుతున్నారన్నారు. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయన్నారు. ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా సమస్యలుండవన్నారు. యువత, విద్యార్థులు ఆటల మీద దృష్టి పెట్టాలన్నారు. నచ్చిన ఆటను నిత్యం సాధన చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను వినియోగించుకోవాలన్నారు.